

నేపాల్లో సంభవించిన భారీ వరదలు ఆంధ్రప్రదేశ్లోని పలు కుటుంబాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన తమ కుటుంబ సభ్యుల క్షేమ సమాచారం గత 24 గంటలుగా అందకపోవడంతో బంధువులు కలత చెందుతున్నారు. విపత్తు ప్రభావిత ప్రాంతాల్లోనే పలువురు ఏపీ యాత్రికులు ఉన్నట్లు సమాచారం రావడం, వారి ఫోన్లు స్విచ్చాఫ్ కావడంతో ఆందోళన మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల వివరాలను సేకరించే పనిని ప్రారంభించింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఏడుగురు ఆంధ్రప్రదేశ్ వాసులు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు.
నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసుల క్షేమ సమాచారంపై మంత్రి నారా లోకేశ్ సమీక్ష నిర్వహించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. వరదల్లో చిక్కుకున్నప్పటికీ క్షేమంగా ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన భాస్కర్ శాస్త్రి సహా యాత్రికులందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని సూచించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఐటీ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, సహాయక చర్యలను సమన్వయం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!