

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు వెల్లడించారు. తిరుమలను పవిత్రమైన, పర్యావరణహిత దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని సీఎం తెలిపారు. ఆధునీకరించిన ఎస్వీ మ్యూజియం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1లో భక్తుల అనుభూతి కేంద్రం, భక్తులకు ఆధార్ ఆధారిత బీమా వంటి కార్యక్రమాలను వివరించారు. తిరుమలలో కొత్తగా 32 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురాగా, మొత్తం 44 విద్యుత్ బస్సులు భక్తుల రాకపోకలకు ఉపయోగపడనున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా శ్రీవాణి కార్యక్రమం ద్వారా 5 వేల దేవాలయాల నిర్మాణం, పాత ఆలయాల పునరుద్ధరణ, టీటీడీ ఆధ్వర్యంలోని వైద్య, విద్యా వ్యవస్థలను అనుసంధానం చేసి మరింత మెరుగుపరచడం వంటి ప్రణాళికలను సీఎం వెల్లడించారు. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు స్కైవాక్, 50 ఎకరాల్లో బహుళ అంతస్తుల పార్కింగ్, 5,192 మంది టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల అభివృద్ధి వంటి ప్రతిపాదనలు ఉన్నాయని తెలిపారు. తిరుమల, తిరుపతిని నెట్జీరో విధానంలో అభివృద్ధి చేయడంతో పాటు సౌర, పవన విద్యుత్, బ్యాటరీ నిల్వ, వ్యర్థాల పునర్వినియోగం, నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. టీటీడీ ఉద్యోగుల గృహ నిర్మాణ ప్రాజెక్టుకు రూ.230 కోట్ల మౌలిక వసతుల ప్రణాళికకు ఆమోదం లభించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!