

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగురవేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 32 నెలల్లో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని సీఎం తెలిపారు. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందించిన సహకారంతోనే ప్రభుత్వం అనేక విజయాలు సాధించిందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక ప్రగతిని సమన్వయం చేస్తూ తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యంతో రాష్ట్రాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తామని చెప్పారు.
రైతు సంక్షేమం, సాగునీటి ప్రాజెక్టులు, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, సామాజిక భద్రతా పింఛన్లు, కనీస వేతనాల సవరణ, గిగ్ కార్మికుల సంక్షేమం, విద్యా సంస్కరణలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, వైద్య రంగంలో మౌలిక వసతుల విస్తరణపై సీఎం వివరించారు. ఇప్పటివరకు 72 వేలకుపైగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని తెలిపారు. తెలంగాణలో ఐటీ ఎగుమతులు, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులతో హైదరాబాద్ ముఖచిత్రం మారబోతోందని, ప్రజల సహకారంతో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!