

సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం మరింత బలోపేతం కావాలని, కేంద్రం-రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని కోరారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడులను అనుసంధానిస్తూ కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. అమరావతి, బెంగళూరు, చెన్నై మధ్య సమగ్ర రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయాలని సూచించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన సమస్యలపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, పోలవరం ప్రాజెక్టు, సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు కేంద్రం సహకారం అందించాలని కోరారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
అదే సమావేశంలో నదీజలాల అంశంపైనా చంద్రబాబు కీలక ప్రతిపాదనలు చేశారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ద్వారా తమిళనాడు నీటి సమస్యకు పరిష్కారం చూపవచ్చని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలు నదీజలాల విషయంలో సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గంగా-కావేరి అనుసంధానానికి జాతీయ ప్రణాళిక రూపొందించాలని, డీపీఆర్లు, అవసరమైన అనుమతులను నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయాలని కోరారు. అలాగే తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్ధామ్ పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ ప్రత్యేక ఆధ్యాత్మిక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు ప్రతిపాదించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!