

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కొళత్తూర్ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. చీఫ్ జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ జీ అరుల్ మురుగన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారణకు అర్హమైనది కాదని పేర్కొంది. ఎన్నికల్లో స్టాలిన్కు 74,202 ఓట్లు రాగా, టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 82,997 ఓట్లతో విజయం సాధించారు.
ఎన్నికల ఫలితాలపై అనుమానాలు వ్యక్తం చేసిన స్టాలిన్, ఈవీఎంల బర్న్ట్ మెమరీ, మైక్రోకంట్రోలర్ పరిశీలనకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరిశీలన సందర్భంగా కొన్ని ఈవీఎంలు పనిచేయకపోవడాన్ని గుర్తించినట్లు ఆయన తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. నియోజకవర్గంలోని 100 శాతం వీవీప్యాట్లను మళ్లీ పరిశీలించాలని ఆయన కోరారు. అయితే, ఎన్నికల కౌంటింగ్పై అభ్యంతరాలను ఎన్నికల సంఘం వద్దే పరిష్కరించుకోవాలని ఈసీ తరఫు న్యాయవాదులు వాదించారు. ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారం ఈ పిటిషన్ను కొనసాగించలేమని పేర్కొన్నారు. వాదనలు ముగిసిన అనంతరం మద్రాస్ హైకోర్టు తాజాగా స్టాలిన్ పిటిషన్ను కొట్టివేసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!