

తెలంగాణలో ఆహార భద్రత వ్యవస్థకు ‘స్మార్ట్’ రూపం రానుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.43 కోట్ల మంది లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 15న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. సంగారెడ్డిలో జరిగే రాష్ట్రస్థాయి కార్యక్రమంలో సీఎం లాంఛనంగా ప్రారంభించగా, అదే రోజు 33 జిల్లా కేంద్రాల్లోనూ ఏకకాలంలో పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంతో ప్రజా పంపిణీ వ్యవస్థ మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మారుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1.06 కోట్లకు పైగా ఆహార భద్రత కార్డుల ద్వారా 3.43 కోట్ల మందికి ఆహార భద్రత అందుతోందని మంత్రి వెల్లడించారు. ప్రతి అర్హుడికి నెలకు ఆరు కిలోల సన్నబియ్యాన్ని ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. 2025 జనవరి 26 నుంచి ఇప్పటివరకు 16.32 లక్షల కొత్త కార్డులు జారీ చేసి, 61.08 లక్షల మందికి లబ్ధి చేకూర్చినట్లు తెలిపారు. ఆగస్టు 15న జరిగే కార్యక్రమాల్లో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!