

చైనాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థ హువావే వ్యవస్థాపకుడు, సీఈఓ రెన్ జెంగ్ఫీ దేశం వీడారంటూ సోషల్మీడియాలో ప్రచారం జరుగుతోంది. కుటుంబంతో కలిసి ఆయన సముద్ర మార్గంలో చైనా నుంచి బయటకు వెళ్లారన్న వాదనలు వైరల్గా మారాయి. షెన్జెన్లోని హువావే ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారన్న పోస్టులు కూడా ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తున్నాయి. అయితే రెన్ జెంగ్ఫీ చైనా వీడినట్లు ఇప్పటివరకు స్వతంత్రంగా ధ్రువీకరించే విశ్వసనీయ ఆధారాలు లేవు. హువావే లేదా చైనా అధికారిక వర్గాలు కూడా ఈ విషయంపై ఎలాంటి నిర్ధారణ చేయలేదు.
ఈ రూమర్లకు ప్రధాన కారణం చైనాలో సెప్టెంబర్ 15 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఎగ్జిట్-ఎంట్రీ నిబంధనలు. ఎగుమతి నియంత్రణలు, టెక్నాలజీ దిగుమతి-ఎగుమతి నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా దేశ పారిశ్రామిక లేదా సాంకేతిక భద్రతకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న వ్యక్తుల విదేశీ ప్రయాణాలను అధికారులు నిరోధించవచ్చు. జాతీయ భద్రతకు సంబంధించిన ఇతర పరిస్థితుల్లోనూ ప్రయాణ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన సమయానికి రెన్ జెంగ్ఫీ దేశం వీడారన్న ప్రచారం తెరపైకి రావడంతో చర్చకు దారితీసింది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం ధ్రువీకరణ లేని రూమర్గానే చూడాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!