

అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ సైనిక ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చడంతో కీలకమైన హర్మూజ్ జలసంధి చుట్టూ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో జలసంధి వెలుపల కొత్త ‘నిషేధిత’ లేదా ‘పరిమిత’ సముద్ర ప్రాంతాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహసెన్ రెజాయ్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాన్ని ప్రకటిస్తామని, అక్కడికి ప్రవేశించే నౌకలను ఆంక్షల జాబితాలో చేర్చే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రాంతం అమెరికా నౌకాదళం ఏర్పాటు చేసిన దిగ్బంధన రేఖ సమీపం నుంచి పర్షియన్ గల్ఫ్లోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించే అవకాశం ఉందని ఇరాన్ వర్గాలు తెలిపాయి.
ఈ పరిణామానికి ముందు సెప్టెంబర్ 5న ఇరాన్ రెండు అమెరికా నౌకలపై క్షిపణి దాడులు చేసిందని అమెరికా పేర్కొనగా.. ప్రతిగా మూడు ఇరాన్ చమురు ట్యాంకర్లపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. అనంతరం ఇరాన్ కూడా అనుమతి లేని మార్గాల్లో ప్రయాణిస్తున్న నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. అయితే ఇరు దేశాలు పరస్పరం చేస్తున్న కొన్ని దాడుల ఆరోపణలను ప్రత్యర్థి వర్గాలు ఖండిస్తున్నాయి. తాజా ఉద్రిక్తతల ప్రభావంతో హర్మూజ్ మీదుగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. దీంతో ప్రపంచ చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగి, అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు కూడా పైకి కదిలాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!