

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడు, పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘానికి ఇచ్చిన హామీని నెరవేర్చారు. గత మే 4న శిల్పకళావేదికలో డాక్టర్ దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా నిర్వహించిన డైరెక్టర్స్ డే వేడుకల్లో, దర్శకుల సంఘంలోని ఆర్థికంగా వెనుకబడిన సభ్యుడి కుమారుడు లేదా కుమార్తెకు తిరుపతిలోని తన విద్యాసంస్థలో ప్రతి ఏటా ఉచిత విద్య అందిస్తానని ప్రకటించారు. ఆ హామీలో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం నుంచి సంఘం సభ్యుడు, సహకార దర్శకుడు ఎలిపే శ్రీనివాసరావు కుమార్తె ఎలిపే దేదీప్య సిరికి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఉచిత విద్యతో పాటు ఉచిత హాస్టల్ వసతిని కల్పించారు.
విద్యా సహాయంతో పాటు దర్శకుల సంఘం సభ్యుల ట్రస్టు, మెడికల్ ఇన్సూరెన్స్ కోసం మోహన్ బాబు రూ.15 లక్షల విరాళాన్ని కూడా ప్రకటించారు. ఆయన నిర్ణయంపై తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. దర్శకుల సంఘం సభ్యుల పిల్లల భవిష్యత్తుకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొంటూ సంఘం అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పి.వి. రామారావు, కోశాధికారి నీలం సాయిరాజేష్తో పాటు కార్యవర్గ సభ్యులు మోహన్ బాబుకు కృతజ్ఞతలు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!