

హైదరాబాద్ ఐటీ కారిడార్లోని ఐకియా షోరూం, డెలాయిట్ సంస్థ ఎదురుగా పేరుకుపోయిన భారీ నిర్మాణ వ్యర్థాలపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. నగర ప్రతిష్ఠను దెబ్బతీసేలా చెత్త, నిర్మాణ వ్యర్థాలను డంపింగ్ చేస్తున్న సంస్థలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో సమీపంలోని మూడు బహుళ అంతస్తుల భవనాల నిర్మాణ వ్యర్థాలు అక్కడ పేరుకుపోయినట్లు గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. సుమారు 13 ఎకరాల్లో ఉన్న ఈ ప్రాంతంలో దాదాపు 15 లక్షల మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉన్నట్లు అంచనా. ఐకియా–డెలాయిట్ ప్రాంతంలోని భారీ నిర్మాణ వ్యర్థాల తొలగింపునకు సీఎంసీ ఇప్పటికే చర్యలు ప్రారంభించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి.
సీఎంసీ కమిషనర్ జి. సృజన ఈ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం వ్యర్థాలను శాస్త్రీయంగా రీసైక్లింగ్ చేసేందుకు కార్యాచరణపై దృష్టి సారించారు. వ్యర్థాలను శంషాబాద్ లేదా జీడిమెట్లలోని నిర్మాణ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలకు తరలించడం, లేదా అదే ప్రాంతంలో రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అనే రెండు ప్రతిపాదనలను అధికారులు పరిశీలిస్తున్నారు. వ్యర్థాలను తరలిస్తే రవాణా ఖర్చులతో పాటు ట్రాఫిక్, కాలుష్య సమస్యలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. డంపింగ్కు బాధ్యులైన సంస్థలతోనే రీసైక్లింగ్, పునరుద్ధరణ పనులు చేయించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!