

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మరోసారి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నిధుల విడుదల వంటి కీలక అంశాలపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్తో సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఇప్పటికే జూన్ 16న పంపిన లేఖను ప్రస్తావిస్తూ, ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కేంద్రం జోక్యం అవసరమని పేర్కొన్నారు.
జూన్ 22, 23 తేదీలలో తాను న్యూఢిల్లీ పర్యటనలో ఉండనున్నట్లు సీఎం తెలిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి, అశ్వినీ వైష్ణవ్లతో కలిసి సమావేశమై హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరపాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన పట్టణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా మెట్రోను పేర్కొంటూ, పెండింగ్ అంశాల పరిష్కారం కోసం అవసరమైన ఒప్పందాలు, పత్రాలను కూడా వెంట తీసుకువస్తానని తెలిపారు. సమావేశానికి సంబంధించిన వివరాలను త్వరగా తెలియజేయాలని సీఎం లేఖలో కోరారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!