

చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ బీమా లేకుండా రోడ్లపై తిరుగుతున్న వాహనాల సంఖ్య పెరుగుతుండటంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో నమోదైన 30.48 కోట్లకు పైగా వాహనాల్లో దాదాపు 56 శాతం వాహనాలకు బీమా లేదని ధర్మాసనం వెల్లడించింది. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులు, వారి కుటుంబాలకు సకాలంలో పరిహారం అందకపోవడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కల్పిస్తున్న జీవించే హక్కుకు భంగం కలిగిస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ సమస్యకు పరిష్కారం కోసం సుప్రీంకోర్టు పలు కీలక సూచనలు చేసింది. బీమా లేని వాహనాలకు ఇంధనం సరఫరా నిలిపివేసే ‘బీమా లేదు.. ఇంధనం లేదు’ విధానాన్ని పరిశీలించాలని రోడ్డు రవాణా శాఖ, బీమా నియంత్రణ సంస్థ (ఐఆర్డీఏఐ), పెట్రోలియం మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. అలాగే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు కెమెరాలను వాహన్ డేటాబేస్తో అనుసంధానం చేసి, నిబంధనలు ఉల్లంఘించే వాహనాలకు ఈ-చలాన్లు జారీ చేయాలని సూచించింది. కొత్త కార్లు, ద్విచక్ర వాహనాలకు తప్పనిసరి థర్డ్ పార్టీ బీమా కాలాన్ని పెంచే అంశాన్ని కూడా పరిశీలించాలని ఐఆర్డీఏఐకి సూచించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!