

రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించి, అక్కడి నుంచి భారత్తో రవాణా అనుసంధానాన్ని బలోపేతం చేసే ప్రతిపాదనను రష్యా పరిశీలిస్తోంది. రష్యా ఉప ప్రధాని మరాట్ ఖుస్నులిన్ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. తుర్కియే నియంత్రణలోని బోస్ఫోరస్, ఇరాన్ ఆధీనంలోని హర్మూజ్ జలసంధుల వంటి వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో తలెత్తే సమస్యలను అధిగమించేందుకు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ వివరాలను రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ టాస్ వెల్లడించింది.
తుర్క్మెనిస్థాన్, ఇరాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించవచ్చని ఖుస్నులిన్ సూచించారు. భారత్ను అనుసంధానించే ఏ మార్గమైనా ఆమోదయోగ్యమేనని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ప్రాంతీయ ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధిలో నౌకా రవాణాకు అంతరాయాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా నుంచి హిందూ మహాసముద్రం వరకు రైల్వే కనెక్టివిటీ ఏర్పడితే భారత్తో వాణిజ్య, రవాణా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కొత్త మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!