

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం అనంతరం హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో భారత జెండా లేదా భారత ప్రయోజనాలకు అనుబంధంగా ఉన్న 11 నౌకలు విజయవంతంగా జలసంధిని దాటినట్లు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జయస్వాల్ వెల్లడించారు. పశ్చిమాసియాలోని పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఇంధన భద్రతకు ప్రాధాన్యం ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్లో మరో పది భారత జెండా నౌకలు ఉండగా, ఇటీవల రెండు కొత్త నౌకలు కూడా అక్కడికి చేరాయి. హర్మూజ్ను దాటిన నౌకల్లో మూడు భారత జెండా కలిగిన ముడి చమురు ట్యాంకర్లు, ఒక ఎల్పీజీ నౌక, మరో చమురు ట్యాంకర్, అలాగే ఎరువులు రవాణా చేస్తున్న ఆరు భారీ నౌకలు ఉన్నాయి. మిగిలిన నౌకలు కూడా త్వరలో జలసంధిని దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు అంశంపై స్పందించిన జయస్వాల్, 140 కోట్ల ప్రజలకు తక్కువ ధరలో ఇంధనం అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!