

భారత్-యునైటెడ్ కింగ్డమ్ మధ్య అమల్లోకి వచ్చిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (CETA) ద్వారా తెలంగాణకు గరిష్ఠ ప్రయోజనం చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. యూకే డిప్యూటీ ట్రేడ్ కమిషనర్ (దక్షిణాసియా) చంద్రు కె. అయ్యర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమైన మంత్రి, ఈ ఒప్పందం ద్వారా భారతదేశం నుంచి యూకేకు ఎగుమతి అయ్యే 99 శాతం పారిశ్రామిక ఉత్పత్తులపై సుంకాలు తొలగించబడటం రాష్ట్ర పరిశ్రమలకు కొత్త అవకాశాలను తెరుస్తుందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం 25 బిలియన్ పౌండ్లు (సుమారు రూ.3.25 లక్షల కోట్లు) దాటే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
తెలంగాణ ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏవియేషన్, డిఫెన్స్, ఐటీ, సెమికండక్టర్స్, చిప్ డిజైన్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఎదిగిందని శ్రీధర్ బాబు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం నుంచి యూకేకు రూ.3,553 కోట్ల విలువైన ఎగుమతులు జరుగుతున్నాయని, కొత్త ఒప్పందంతో ఈ ఎగుమతులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. స్థానిక పారిశ్రామికవేత్తలకు సీఈటీఏ ప్రయోజనాలపై అవగాహన కల్పించే సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించిన మంత్రి, యూకే పెట్టుబడిదారులు తెలంగాణలో ఉన్న ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను వినియోగించుకోవాలని ఆహ్వానించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!