

తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఎకరం చొప్పున భూమి పంపిణీ చేస్తామని తెలంగాణ రక్షణ సేన పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ‘భూ లక్ష్మి’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. సామాజిక న్యాయం పేరుతో ప్రభుత్వం మాటలు చెబుతోందని, అయితే ఆచరణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఆమె విమర్శించారు. గత రెండేళ్లలో భారీ బడ్జెట్ కేటాయించినప్పటికీ బీసీల సంక్షేమానికి తక్కువ మొత్తమే ఖర్చు చేశారని ఆరోపించారు. భూదోపిడీ, అసైన్డ్ భూముల అంశంలోనూ ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు చేశారు.
సామాజిక న్యాయం సాధించాలంటే రాష్ట్రంలో మరోసారి భూ పంపిణీ జరగాల్సిన అవసరం ఉందని కవిత అన్నారు. ప్రభుత్వం వద్ద ఉన్న భూములు, భూదాన్ భూములను వినియోగించి ప్రతి కుటుంబానికి ఎకరం చొప్పున అందించే అవకాశం ఉందని పేర్కొన్నారు. పేదల భూములను లాక్కుంటే తమ పార్టీ తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం వద్ద సుమారు 60 లక్షల ఎకరాల భూమి ఉందని, భూదాన్ భూముల్లోనూ పెద్ద మొత్తంలో భూమి ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే భూమి పంపిణీ చేయాలనే సంకల్పం ప్రభుత్వానికి లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ‘భూ లక్ష్మి’ పథకం ద్వారా భూమిలేని కుటుంబాలకు ఎకరం భూమి ఇస్తామని కవిత ప్రకటించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!