

సూపర్స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంతో కథానాయకుడిగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో పి.కిరణ్ నిర్మించిన ఈ చిత్రం జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్కు ప్రేక్షకులు, ఘట్టమనేని అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోందని తన సన్నిహితులు చెప్పినట్లు జయకృష్ణ తెలిపారు. సినిమాల్లోకి రాకముందే న్యూయార్క్లో నటనలో శిక్షణ తీసుకోవడంతో కెమెరా ముందు నటనపై కొంత అవగాహన ఉన్నప్పటికీ, తొలి సినిమా కావడంతో ప్రారంభంలో కాస్త కంగారు పడ్డానని చెప్పారు. చిత్రీకరణ కొనసాగేకొద్దీ ఆ భయం తొలగిపోయిందన్నారు. కథలోని భావోద్వేగాలు తనను బాగా ఆకట్టుకున్నాయని, తొలి చిత్రంలోనే మోహన్బాబు వంటి సీనియర్ నటుడితో కలిసి పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు అజయ్ భూపతి తన నటనను మెచ్చుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు.
సూపర్స్టార్ కృష్ణ మనవడిగా, మహేశ్బాబు కుటుంబం నుంచి హీరోగా వస్తుండటంతో తనపై అంచనాలు ఉంటాయని జయకృష్ణ అంగీకరించారు. అయితే తనలోని కళ, ప్రతిభే తనను స్టార్గా నిలబెట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. నటుడిగా ఎదగగలనో లేదో సందిగ్ధంలో ఉన్న సమయంలో కృష్ణ తనను ప్రోత్సహించి, న్యూయార్క్ వెళ్లి శిక్షణ తీసుకోవాలని సూచించారని గుర్తుచేసుకున్నారు. తనపై తాతయ్య ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యమని చెప్పారు. మహేశ్బాబు కూడా ఏ పనినీ సగం సగంగా చేయకుండా పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారని వెల్లడించారు. తనను అత్యంత ప్రభావితం చేసిన చిత్రం ‘అతడు’ అని చెప్పిన జయకృష్ణ.. అందులోని కథానాయకుడిలాగే తానూ తక్కువగా మాట్లాడుతూ, ఎక్కువగా గమనిస్తుంటానన్నారు. కృష్ణ మాటను నిలబెట్టి నటుడిగా తనను తాను నిరూపించుకోవడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!