

తిరుమల శ్రీవారి హుండీకి భక్తుల నుంచి భారీగా కానుకలు సమకూరాయి. సెప్టెంబర్ 10న ఒక్కరోజులోనే రూ.6.93 కోట్ల హుండీ ఆదాయం నమోదైనట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. సాధారణంగా శ్రీవారి హుండీకి రోజుకు రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ఆదాయం వస్తుండగా.. తాజాగా రూ.6 కోట్ల మార్కును దాటి భారీ మొత్తం నమోదైంది. తిరుమల చరిత్రలో ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.6 కోట్లను దాటడం ఇది నాలుగోసారి కావడం విశేషం. భక్తుల రద్దీ పెరగడం, వరుస సెలవుల నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివస్తుండటంతో హుండీ ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తమ మొక్కులు చెల్లించుకోవడంతో పాటు నగదు, ఇతర కానుకలను హుండీలో సమర్పిస్తున్నారు.
టీటీడీ రికార్డుల ప్రకారం.. శ్రీవారి హుండీకి ఇప్పటివరకు అత్యధికంగా 2023 జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా రూ.7.68 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే ఇప్పటికీ ఒక్కరోజు హుండీ ఆదాయంలో ఆల్టైమ్ రికార్డుగా కొనసాగుతోంది. అంతకుముందు 2022 అక్టోబర్లో రూ.6.31 కోట్లు, 2018 జూలైలో రూ.6.28 కోట్ల ఆదాయం నమోదైంది. తాజాగా రూ.6.93 కోట్లతో మరో భారీ మొత్తం రికార్డుల జాబితాలో చేరింది. ఈ ఆదాయం రూ.7.68 కోట్ల ఆల్టైమ్ రికార్డుకు చేరువగా ఉండటం విశేషం. భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో తిరుమలలో గోవింద నామస్మరణతో పాటు ఏడుకొండలవాడికి కానుకల ప్రవాహం కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!