

అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు ప్రధాన పాత్రలో నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు రూ.100 కోట్ల వసూళ్లు దాటి మహిళా ప్రాధాన్య చిత్రాల్లో కొత్త చరిత్ర సృష్టించినట్లు సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విజయాన్ని పురస్కరించుకుని చిత్రబృందం సమంతకు ప్రత్యేక సర్ప్రైజ్ ఇవ్వగా, అందుకు సంబంధించిన వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు.
ఈ సందర్భంగా సినిమా విడుదలకు ముందు ఎదురైన సందేహాలను సమంత గుర్తుచేసుకున్నారు. మహిళా ప్రాధాన్యమున్న సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని, ఒక ఎగ్జిబిటర్ కూడా "హీరోయిన్ సినిమా ఎవరు చూస్తారు?" అని వ్యాఖ్యానించిన విషయాన్ని వెల్లడించారు. ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలే మార్పుకు నాంది పలుకుతాయని పేర్కొన్న సమంత, ఈ విజయం మహిళా కథానాయికల సినిమాలపై ఉన్న అభిప్రాయాన్ని మార్చాలని ఆకాంక్షించారు. ఈ ఘన విజయంపై కాజల్ అగర్వాల్, మృణాల్ ఠాకూర్, రకుల్ ప్రీత్ సింగ్, లక్ష్మీ మంచు, దియా మీర్జా, సిరి హనుమంతు, నవదీప్తో పాటు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!