

ప్రైమ్ వీడియో తెరకెక్కించిన ‘ది రివల్యూషనరీస్’ ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఆసక్తికర చర్చ మొదలైంది. నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందిన ఈ పీరియడ్ డ్రామా భారత స్వాతంత్య్ర పోరాటంలోని మరుగునపడిన ఓ కీలక ఘట్టాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. సెప్టెంబర్ 11న ప్రసారం కానున్న ఈ సిరీస్లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యువ విప్లవకారుల త్యాగాలను చూపించనున్నారు. రాష్ బిహారీ బోస్గా భువన్ బామ్, సచీంద్ర నాథ్ సన్యాల్గా రోహిత్ సరాఫ్, బాఘా జతిన్గా గుర్ఫతే పిర్జాదా, ప్రతిభా లాహిరిగా ప్రతిభా రంటా నటించారు. ఈ నటీనటుల ఎంపికపై యువత నుంచి మంచి స్పందన వస్తోంది. అదే సమయంలో బెంగాలీ పాత్రల కోసం బెంగాలీ నటులను ఎంపిక చేయకపోవడంపై కొందరు స్థానిక ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్య్ర పోరాటంలో బెంగాల్ పాత్రను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేస్తున్నందుకు బెంగాలీ ప్రేక్షకులు గర్వపడుతున్నారు. గదర్ ఉద్యమం, కోమగాట మారు వంటి చారిత్రక అంశాలను కూడా కథలో ప్రస్తావించినట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. సుఖ్విందర్ సింగ్ అందించిన నేపథ్య గీతం ఉత్కంఠను మరింత పెంచింది. విప్లవకారుల పోరాటాలతో పాటు వారి స్నేహం, భయాలు, మానసిక వేదనను కూడా కథలో చూపించారు. ఎమ్మే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై మోనిషా అద్వానీ, మధు భోజ్వాని నిర్మించిన ఈ సిరీస్ను సంయుక్త చావ్లా షేక్, అక్షితా వాధ్వానా, శోభిత్ నారంగ్, రుత్వి మెహతా రాశారు. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ భాషల్లో ఇది అందుబాటులోకి రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!