

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై పట్టు రాలేదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు. సీఎం పర్యవేక్షణలో ఉన్న హోం, విద్య, మున్సిపల్ శాఖలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని ఆయన ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రజా సమస్యలను పక్కనబెట్టి సీఎం తన పదవిని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టారని, ఢిల్లీ నాయకత్వం చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.
గత 30 నెలల్లోనే రికార్డు స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను 24 సార్లు బదిలీ చేయడం పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని లక్ష్మణ్ పేర్కొన్నారు. జిల్లాలను అర్థం చేసుకునేలోపే కలెక్టర్లను మార్చడం వల్ల అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. అదేవిధంగా ఎస్ఈఆర్ ప్రక్రియలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని, అక్రమ ఓట్ల అంశంలో ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. మసీదుల్లో బీఎల్వోలు క్యాంపులు నిర్వహించడం పట్ల ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!