

గోదావరి వరద జలాలతో నిండుకుండలా కళకళలాడుతున్న ప్రకాశం బ్యారేజీని పరిశీలించడం ఎంతో సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఉండవల్లి నివాసానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఆయన ప్రకాశం బ్యారేజీ వద్ద ఆగి నీటి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ సీజన్లో ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణాడెల్టాకు తరలించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. కృష్ణా తూర్పు ప్రధాన కాలువ నుంచి 3,928 క్యూసెక్కులు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ నుంచి 3,115 క్యూసెక్కులు, గుంటూరు ఛానల్ నుంచి 115 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
సమర్థవంతమైన నీటి నిర్వహణతో ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొంటామని చంద్రబాబు పేర్కొన్నారు. రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కృష్ణాడెల్టాకు గోదావరి జలాలను తరలించడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడమే కాకుండా నీటి లభ్యతను సమర్థంగా వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. నీటి నిర్వహణపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సీఎం సూచించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!