

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 విస్తరణకు తక్షణ అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిలకు లేఖలు రాశారు. జూన్ 23, 24 తేదీల్లో జరిగిన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, మెట్రో ఫేజ్-1 ఆస్తుల విలువ నిర్ధారణ, అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ, ఫేజ్-2కు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక రూపొందించేందుకు ఎస్బీఐ క్యాప్స్ను నోడల్ ఏజెన్సీగా నియమించాలని ఉమ్మడిగా నిర్ణయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
అయితే ఇప్పటివరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (ToR) ఖరారు కాకపోవడం, ఎస్బీఐ క్యాప్స్కు అధికారిక బాధ్యతలు అప్పగించడంలో జాప్యం జరుగుతోందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆలస్యం వల్ల మెట్రో ఫేజ్-1 నిర్వహణ, ఫేజ్-2 డీపీఆర్ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ప్రభావితమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయం పెరిగే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తూ, హైదరాబాద్ భవిష్యత్ ప్రజా రవాణాకు కీలకమైన మెట్రో ఫేజ్-2 పనులు ఆలస్యం కాకుండా ఇద్దరు కేంద్ర మంత్రులు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని ఎస్బీఐ క్యాప్స్ నియామకాన్ని వెంటనే పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!