

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధీ పెవిలియన్లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. రెండు అంబులెన్స్లను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి, భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఎంఆర్ఐ యంత్రాన్ని వర్చువల్గా ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, సీఎంవో ఓఎస్డీ వేముల శ్రీనివాసులు, టీఎస్టీపీసీ ఛైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమావేశంలో స్వయం సహాయక మహిళా సంఘాలకు మరింత విస్తృతంగా రుణాలు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అధికారులను కోరారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో లాజిస్టిక్ పార్కులు, గోదాములు, రైస్ మిల్లులు ఏర్పాటు చేస్తున్నామని, ఈ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు చేయాలని సూచించారు. మహిళా సంఘాలు రుణాల చెల్లింపుల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నాయని, వారి ఆర్థిక సాధికారతకు బ్యాంకులు మరింత తోడ్పాటు అందించాలని సీఎం పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!