

పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన దూర సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జులు పాల్గొన్నారు. ప్రత్యేక ఓటర్ల జాబితా పునఃపరిశీలన ప్రక్రియలో ఓట్ల తొలగింపు అంశంపై సీఎం రేవంత్రెడ్డి పార్టీ నేతలకు కీలక ఆదేశాలు ఇచ్చారు. క్షేత్రస్థాయి వరకు సరైన బాధ్యత తీసుకోకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ, బాధ్యతలు అప్పగించిన మంత్రులు రెండు రోజులు జిల్లాల్లో పర్యటించి సమీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. శాసనసభ నియోజకవర్గాల బాధ్యతలు చేపట్టిన నేతలు నాలుగు రోజులపాటు క్షేత్రస్థాయిలో ఉండి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని సూచించారు.
ప్రత్యేక ఓటర్ల జాబితా పునఃపరిశీలనలో భాగంగా ఓట్ల తొలగింపు, అనుమానాస్పద ఓట్ల అంశాన్ని కాంగ్రెస్ సీరియస్గా తీసుకోవాలని మీనాక్షి నటరాజన్ అన్నారు. బూత్ స్థాయి ప్రతినిధులు ప్రతి ఓటును పరిశీలించి, అర్హులైన ఓటర్లకు తిరిగి ఓటు హక్కు ఉండేలా చూడాలని సూచించారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, బూత్ స్థాయి ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే సమన్వయకర్తలు, బూత్ స్థాయి ప్రతినిధుల స్థానంలో చురుకైన వారిని నియమించాలని ఆదేశించారు. ఓట్ల తొలగింపు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్రెడ్డి సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!