

కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఉన్నది ‘ఇండియన్ కాంగ్రెస్’ కాదని, ‘ఇటలీ కాంగ్రెస్’ అని వ్యాఖ్యానించారు. వందేమాతరం విషయంలో కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును ప్రతి భారతీయుడు గమనించాలని అన్నారు. వందేమాతరం కేవలం గీతం మాత్రమే కాదని, భారతమాతకు అర్పించే వందనం అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం కీలక పాత్ర పోషించిందని, భారత చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను అర్థం చేసుకోవడమే నిజమైన దేశభక్తి అని చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన బాధ్యత ఉందన్నారు. నీట్ పరీక్షల వ్యవహారంలో కేంద్రం అక్రమాలపై చర్యలు తీసుకుంటోందని, నిందితులపై విచారణ జరుగుతోందని తెలిపారు.
తెలంగాణ రాజకీయాలపైనా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని ఆరోపించారు. బీజేపీ ఎప్పుడూ బీఆర్ఎస్తో కలిసి పోటీ చేయలేదని, అధికారాన్ని పంచుకోలేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్పై చేసిన డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా కార్ రేస్, విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం తదితర ఆరోపణలపై ఇప్పుడు చర్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల అమలుపైనా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందన్నారు. తెలంగాణలో బీజేపీ సొంతంగా పోటీ చేసి అధికారంలోకి వస్తుందని, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని చెప్పారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!