

కుమురం భీం ఆశయ స్ఫూర్తితో ఆదివాసీలు తమ హక్కులు, ఆత్మగౌరవం, భాష, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి.. ఆదివాసీలకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. గిరిజనులు ఏ కులానికీ, ఏ ప్రాంత ప్రజలకూ వ్యతిరేకం కాదని, తమకు దక్కాల్సిన హక్కుల కోసం మాత్రమే పోరాడుతున్నారని స్పష్టం చేశారు.
మారుమూల ప్రాంతాల నుంచి సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ఆదివాసీలను అధికారులు గౌరవంగా స్వీకరించి, వారి వినతులను పరిష్కరించాలని సీతక్క సూచించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇప్పటివరకు వివిధ శాఖల ఆధ్వర్యంలో సుమారు రూ.1,200 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా గిరిజనులు సంప్రదాయ నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. అశ్వారావుపేట పురవీధుల్లో నిర్వహించిన ప్రదర్శనలో సీతక్క పాల్గొని గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేశారు. స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ, ఆదివాసీ జేఏసీ, వివిధ గిరిజన సంఘాల నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!