

విజయసాయిరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. విజయసాయిరెడ్డి సొంత కారణాలతోనే పార్టీని వీడారని, స్వతంత్రంగా రాజకీయాలు చేసుకునే అవకాశం ఆయనకు ఉందని అన్నారు. సొంత పార్టీ పెట్టుకోవాలనుకుంటే వైసీపీని విమర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కేవలం అటెన్షన్ కోసమే విజయసాయి ఆరోపణలు చేస్తున్నారని సజ్జల విమర్శించారు. పార్టీని టార్గెట్ చేస్తే తమ స్పందన కూడా గట్టిగానే ఉంటుందని హెచ్చరించారు.
జగన్ మతమార్పిడులను ప్రోత్సహించారన్న ఆరోపణలను సజ్జల తీవ్రంగా ఖండించారు. నిజంగా జగన్ అలా చేసి ఉంటే, విజయసాయిరెడ్డే అప్పట్లో ఆయన్ను మార్చేవారని వ్యాఖ్యానించారు. పార్టీని వీడిన వారిపై జగన్ ఎప్పుడూ ప్రతికూలంగా మాట్లాడలేదని, విజయసాయినే జగన్ ఎక్కువగా అభిమానించారని పేర్కొన్నారు. 2024 ఎన్నికల తర్వాత పలువురిపై కేసులు నమోదై అరెస్టులు జరిగినప్పటికీ విజయసాయిరెడ్డి ఎలా తప్పించుకోగలిగారని ప్రశ్నించారు. ఇకపై విజయసాయి ఆరోపణలను తాను పట్టించుకోనని, పార్టీ నేతలు కూడా వాటిని పట్టించుకోవద్దని సజ్జల సూచించారు. విజయసాయిరెడ్డి తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారని విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!