

తెలంగాణలో రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురంలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయాన్ని దండగగా కాకుండా పండుగగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత తొమ్మిది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 73.30 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.9,009 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేసినట్లు తెలిపారు. సభా వేదికగా చివరి విడతగా 1.44 లక్షల మంది రైతులకు రూ.1,009.15 కోట్లను విడుదల చేయడంతో పాటు ఈ-పట్టాదారు పాసుపుస్తకాల జారీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గత 30 నెలల్లో రైతు భరోసా, రుణమాఫీ, పంట బీమా, గిట్టుబాటు ధరలు, సన్నవడ్ల బోనస్, ఉచిత విద్యుత్, నష్టపరిహారం తదితర రైతు సంక్షేమ పథకాల కోసం రూ.1.70 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం తెలిపారు. అదనంగా పేదలకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అన్ని వర్గాలకు న్యాయం చేసే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!