

2028 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ డొనాల్డ్ ట్రంప్ తర్వాత రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థి ఎవరనే చర్చ ఇప్పుడే మొదలైంది. ఈ నవంబరులో జరగనున్న అమెరికా మధ్యంతర ఎన్నికలు ట్రంప్ పాలనపై ప్రజల అభిప్రాయానికి కీలక సూచికగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో డాలస్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ సమావేశంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రసంగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వాన్స్ మైక్రోఫోన్ వద్దకు రాగానే అభిమానులు ‘జేడీ.. జేడీ’ అంటూ నినాదాలు చేయగా, ఓ అభిమాని ‘జేడీ 48’ అంటూ నినదించారు. అయితే వాన్స్ స్పందిస్తూ ముందుగా నవంబరు ఎన్నికల్లో పార్టీ బాధ్యతను నిర్వర్తించాలని, ఆ తర్వాతి పరిణామాల గురించి ఆలోచిద్దామని అన్నారు.
ట్రంప్ వారసుడిగా వాన్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తున్నప్పటికీ, ఆయన 2028 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ఇంకా ప్రకటించలేదు. ట్రంప్ కూడా తన వారసుడిని అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు విదేశాంగ మంత్రి మార్కో రుబియో, టెక్సాస్ సెనేటర్ టెడ్ క్రూజ్, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పేర్లు కూడా రిపబ్లికన్ వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. 2016లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం ట్రంప్తో పోటీ పడిన రుబియోను భవిష్యత్ అధ్యక్ష అభ్యర్థిగా కొందరు పార్టీ నేతలు భావిస్తున్నారు. 2028లో వాన్స్, రుబియోలను అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా బరిలోకి దించే అవకాశం ఉందన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నిర్ణయం వెలువడలేదు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!