

తృణమూల్ కాంగ్రెస్లో అంతర్గత సంక్షోభం మరింతగా ముదిరింది. మమతా బెనర్జీని టీఎంసీ పార్టీ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్టు సోమవారం రెబల్ ఎమ్మెల్యేల వర్గం ప్రకటించింది. సీనియర్ ఎమ్మెల్యే అరుప్ రాయ్ను చైర్పర్సన్గా ఎన్నుకున్నట్టు తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్ను 1998లో మమతనే స్థాపించారు. అయితే, ఇటీవలి ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో తమదే ‘నిజమైన తృణమూల్ కాంగ్రెస్’ అని ప్రతిపక్షనేత రితబ్రత బెనర్జీ ఆధ్వర్యంలోని రెబల్స్ ప్రకటించారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి మమత మేనల్లుడు, ఎంపీ.. అభిషేక్ బెనర్జీని సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపారు. సమాంతర పార్టీ కార్యవర్గాన్ని ప్రకటించారు. న్యూటౌన్లోని ఓ ఫైవ్స్టార్ హోటల్లో సమావేశమైన రెబల్ ఎమ్మెల్యేలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో తలెత్తిన ‘రాజ్యాంగ సంక్షోభా’న్ని పరిష్కరించడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు రితబ్రత బెనర్జీ తెలిపారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ జాతీయ వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉందని చెప్పారు. 2022 ఫిబ్రవరిలో ఆ కమిటీ ఏర్పాటయిందని, దాని గడువు ముగిసినా కొత్తది ఏర్పాటు కాలేదని తెలిపారు. దాంతో రాజ్యాంగపర సంక్షోభం తలెత్తిందని చెప్పారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!