

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యలపై సమర్థంగా పోరాడేందుకు కొత్త రాజకీయ పార్టీ అవసరమని అన్నారు. గత 15 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాలు టీడీపీ, వైసీపీ చుట్టూనే తిరుగుతున్నాయని, ఈ రెండు పార్టీల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో రెండు పార్టీలు విఫలమయ్యాయని ఆరోపిస్తూ, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ప్రభుత్వ ఖర్చులు, ప్రజలపై పెరుగుతున్న ఆర్థిక భారంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాష్ట్ర అప్పులపై ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన లెక్కలు వెల్లడించాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిధులను దుబారా చేయకుండా ప్రైవేట్ పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించాలని, సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని అన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి సమగ్ర ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు రాజకీయాల్లో విస్తృత అవకాశాలు కల్పిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. ముఖ్యంగా జెన్-జీ యువతకు ప్రాధాన్యం ఇస్తామని, పార్టీ పదవులు, అవకాశాల్లో 66 శాతం యువతకు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించడంతో పాటు సౌర విద్యుత్ను వినియోగించుకోవాలని సూచించారు. ఉపాధి, విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని, ఏపీపీఎస్సీ, డీఎస్సీ వ్యవహారాలపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
విజయదశమి తర్వాతి రోజే కొత్త పార్టీ వివరాలను ప్రకటిస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అంతకుముందు అనంతపురం, విశాఖపట్నం, తిరుపతిలో మరో నాలుగు ప్రెస్మీట్లు నిర్వహిస్తానని చెప్పారు. అనంతరం కాంక్లేవ్ నిర్వహించి పార్టీ పేరు, జెండా, అజెండాను ప్రకటిస్తానన్నారు. తమది ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన ప్రాంతీయ పార్టీ అని స్పష్టం చేసిన ఆయన, యువతతో కలిసి పార్టీని స్థాపిస్తానని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!