

ప్రభుత్వ విప్ బల్మూర్ వెంకట్ బీజేపీ చేపట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ దీక్షపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఫీజు బకాయిల పేరుతో బీజేపీ నేత రామచందర్ రావు 48 గంటల దీక్ష చేయడం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై మాట్లాడే నైతిక హక్కు, అర్హత బీజేపీకి ఉందా అని నిలదీశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్, విద్యార్థుల ఆత్మహత్యలు, నిరుద్యోగుల సమస్యలు, గతంలో జరిగిన పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల సమయంలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నప్పుడు ఎందుకు ఆందోళన చేయలేదని విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ను ఈ ఏడాది నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ బీజేపీ దీక్షలు చేయడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని వెంకట్ ఆరోపించారు. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా ఎప్పటికప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టులో స్పష్టం చేసిందని తెలిపారు. బ్యాంకులో రూ.300 కోట్లు ముందస్తుగా ఉంచి విద్యార్థుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైన తర్వాత కూడా దీక్ష చేయడం అర్థరహితమన్నారు. కాంగ్రెస్ను ఎదుర్కొనేందుకు బీజేపీ, బీఆర్ఎస్తో సన్నిహితంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన, బీజేపీ ఆందోళనలు, రాజకీయ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!