

ప్రపంచ అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత యువ అథ్లెట్లు చరిత్రాత్మక ప్రదర్శన చేశారు. పురుషుల హైజంప్లో 19 ఏళ్ల బసంత్ కుమార్ మేఘ్వాల్ 2.21 మీటర్ల ఎత్తు దూకి రజత పతకాన్ని సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో హైజంప్లో భారత్కు పతకం అందించిన తొలి అథ్లెట్గా రికార్డు సృష్టించాడు. అల్జీరియాకు చెందిన యూన్స్ అయాచి 2.21 మీటర్లతో స్వర్ణం, బ్రిటన్కు చెందిన ఓటిస్ పూల్ కాంస్యం గెలిచారు. ముగ్గురూ 2.24 మీటర్లను దాటలేకపోయారు. గతంలో బసంత్ అత్యుత్తమ ప్రదర్శన 2.11 మీటర్లు కాగా.. మాజీ జాతీయ రికార్డు హైజంపర్ సహానా కుమారి మార్గదర్శకత్వంలో 2.21 మీటర్లకు మెరుగుపడ్డాడు.
లాంగ్జంప్లోనూ భారత్కు మరో పతకం దక్కింది. 18 ఏళ్ల షానవాజ్ ఖాన్ మూడో ప్రయత్నంలో 7.84 మీటర్ల దూరం దూకి కాంస్య పతకాన్ని సాధించాడు. ఇటలీకి చెందిన డానియెల్ ఇంజోలి 7.97 మీటర్లతో స్వర్ణం, ఆస్ట్రేలియాకు చెందిన మెక్గ్రాడర్ 7.96 మీటర్లతో రజతం గెలిచారు. చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన షానవాజ్ కష్టాలను అధిగమించి అథ్లెటిక్స్లో రాణిస్తున్నాడు. 2028 లాస్ఏంజెలెస్ ఒలింపిక్స్లో పాల్గొనడం తన లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరోవైపు భారత మహిళల 4×400 మీటర్ల రిలే జట్టు ఫైనల్కు అర్హత సాధించింది. మహిళల 4×100 మీటర్లు, పురుషుల 4×400 మీటర్ల రిలే జట్లు ఫైనల్కు చేరలేకపోయాయి. పురుషుల 5,000 మీటర్ల రేస్వాక్లో నితిన్ గుప్తా ఆరో స్థానంలో నిలిచాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!