

కామన్వెల్త్ గేమ్స్ 2026 ప్రారంభానికి ముందు భారత జుడో జట్టుకు అనుకోని ఇబ్బంది ఎదురైంది. భారత్ నుంచి గ్లాస్గోకు చేరుకున్న 16 మంది సభ్యుల బృందంలో పలువురు జుడోకాలకు చెందిన లగేజీ గమ్యస్థానానికి చేరకపోవడంతో సాధనకు ఆటంకం ఏర్పడింది. జులై 31 నుంచి పోటీలు ప్రారంభం కానుండగా, లగేజీలో జుడోగీలు, శిక్షణకు అవసరమైన ఇతర సామగ్రి ఉండటంతో ఆటగాళ్లు ఆందోళన చెందుతున్నారు. పోటీలకు ముందు పూర్తి స్థాయిలో ప్రాక్టీస్ చేసే అవకాశాలు తగ్గిపోవడం జట్టుకు ప్రతికూలంగా మారింది.
ఈ సమస్యపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) వెంటనే స్పందించింది. సంబంధిత విమానయాన సంస్థ అధికారులతో సమన్వయం చేస్తూ లగేజీని వీలైనంత త్వరగా ఆటగాళ్లకు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇటీవల భారత బాక్సింగ్ జట్టుకూ ఇలాంటి లగేజీ సమస్య ఎదురవడం గమనార్హం. వరుసగా రెండు జట్లకు ఎదురైన ఈ ఇబ్బందులు భారత బృందం ఎదుర్కొంటున్న నిర్వహణపరమైన సవాళ్లపై చర్చకు దారితీశాయి. పోటీలు ప్రారంభమయ్యేలోపు సామగ్రి చేరితేనే ఆటగాళ్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!