

రోడ్డు ప్రమాదాల్లో ప్రయాణికుల భద్రతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో ‘భారత్ ఎన్క్యాప్ 2’ ప్రమాణాలను 2027 అక్టోబర్ నుంచి అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. సియామ్ 66వ వార్షిక సదస్సులో మాట్లాడిన ఆయన.. 2023లో ప్రారంభమైన భారత్ ఎన్క్యాప్ ద్వారా కార్ల భద్రతను అంచనా వేయడంలో గణనీయమైన పురోగతి సాధించామని చెప్పారు. కొత్త విధానంలో రోడ్డు భద్రతకు సంబంధించిన సమగ్ర భద్రతా వ్యవస్థను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం భారత్లో ఏటా సుమారు 5 లక్షల రోడ్డు ప్రమాదాలు జరుగుతుండగా, 1.80 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని, మృతుల్లో 18–36 ఏళ్ల వయసువారే అధికంగా ఉన్నారని తెలిపారు.
మరోవైపు, రాబోయే కొన్నేళ్లలో విద్యుత్ వాహనాలకు అందిస్తున్న ప్రభుత్వ రాయితీలు ముగిసే అవకాశం ఉందని భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శి కమ్రాన్ రిజ్వి తెలిపారు. వాహన పరిశ్రమ ఛార్జింగ్ మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించడంతో పాటు పరిశోధన, అభివృద్ధిపై పెట్టుబడులు పెంచాలని సూచించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వాహన రంగం రూ.22.75 లక్షల కోట్లకు పైగా సహకరిస్తోందని సియామ్ అధ్యక్షుడు శైలేష్ చంద్ర తెలిపారు. దేశ జీఎస్టీ వసూళ్లలో ఈ రంగం వాటా 15 శాతంగా ఉందని, 2025–26లో 46 లక్షల కార్లు, 2.17 కోట్ల ద్విచక్ర వాహనాలు విక్రయించినట్లు వివరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!