

ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోకుండా ఫైనల్కు చేరిన టీమ్ఇండియా.. శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించి ఎనిమిదోసారి ఆసియాకప్ ఛాంపియన్గా నిలిచింది. అయితే ట్రోఫీ అందుకునే సమయంలో చోటుచేసుకున్న పరిణామం చర్చనీయాంశంగా మారింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీని అందుకోవడానికి భారత మహిళల జట్టు నిరాకరించింది. ఈ నిర్ణయం బీసీసీఐ వైఖరికి అనుగుణంగానే తీసుకున్నట్లు ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ స్పష్టం చేశారు. తాము ఛాంపియన్లుగా నిలిచామన్న విషయమే ముఖ్యమని, ట్రోఫీ ఎవరితో అందుకున్నామన్నది తమకు పట్టింపు లేదని అన్నారు.
బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కూడా ఈ నిర్ణయాన్ని సమర్థించారు. గత ఏడాది పహల్గాం ఘటన తర్వాత భారత్-పాక్ సంబంధాల్లో పరిస్థితులు మారాయని, పొరుగుదేశంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దన్న ప్రజల ఒత్తిడి ఉందని చెప్పారు. అయితే అంతర్జాతీయ టోర్నీల్లో అన్ని దేశాలతో ఆడాలన్నది ప్రభుత్వ విధానమని, అదే సమయంలో భారత ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నాయకుల చేతుల మీదుగా ట్రోఫీని స్వీకరించలేమని స్పష్టం చేశారు. గత ఏడాది పురుషుల జట్టు తీసుకున్న నిర్ణయానికి మహిళల జట్టు సంఘీభావం తెలిపిందన్నారు. ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 72 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించగా.. షెఫాలి వర్మ, స్మృతి మంధాన, తెలుగమ్మాయి శ్రీచరణి, దీప్తి శర్మ కీలక ప్రదర్శనలతో జట్టు విజయాన్ని అందుకుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!