

సరకు రవాణా రంగంలో భారత రైల్వే కీలక మైలురాయిని సాధించింది. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (DFC) నెట్వర్క్ను పూర్తి చేయడంతో దేశంలో సరకు రవాణాకు ప్రత్యేకమైన, వేగవంతమైన మార్గం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ను ప్రపంచంలోనే తొలి పూర్తి ఎలక్ట్రిఫైడ్ ఫ్రైట్ కారిడార్గా పేర్కొంటున్నారు. ఇందులో డబుల్ స్టాక్ కంటైనర్ రైళ్లను నడిపేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అమెరికా, కెనడా వంటి దేశాల్లో డబుల్ స్టాక్ రైళ్లు నడుస్తున్నప్పటికీ.. భారత్లో పూర్తిగా విద్యుదీకరించిన మార్గంలో ఇలాంటి భారీ సరకు రవాణా నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది. వేగవంతమైన సరకు రవాణా కోసం భారత ప్రభుత్వం 2006లో డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL)ను ఏర్పాటు చేసింది.
ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ 1,337 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా.. వెస్ట్రన్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పొడవు 1,506 కిలోమీటర్లు. వెస్ట్రన్ కారిడార్లోని చివరి 326 కిలోమీటర్ల సెక్షన్లు అందుబాటులోకి రావడంతో మొత్తం DFC నెట్వర్క్ పొడవు 2,843 కిలోమీటర్లకు చేరింది. సుమారు 7.45 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన ఓవర్హెడ్ విద్యుత్ వైర్ల కారణంగా ఒకదానిపై మరొకటి రెండు కంటైనర్లను రవాణా చేసే వీలుంది. దీంతో ఒక్కో రైలులో ఎక్కువ సరకు తరలించవచ్చు. ఇంధన వినియోగం, ఉద్గారాలు తగ్గడంతో పాటు సాధారణ రైలు మార్గాల్లో ప్యాసింజర్ రైళ్ల రాకపోకలకు ఏర్పడే అంతరాయాలు కూడా తగ్గనున్నాయి. డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు దేశ వాణిజ్యం, లాజిస్టిక్స్ వ్యవస్థకు వెన్నెముకగా మారుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గతంలో సరకు రైలు 100 కిలోమీటర్లు ప్రయాణించేందుకు సుమారు 6.5 గంటలు పట్టేదని.. ఇప్పుడు అంతకంటే సగం కంటే తక్కువ సమయంలోనే ఆ దూరాన్ని చేరుకునే అవకాశం ఉందని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!