

దేశీయ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్కు చెందిన వేగవంతమైన డెలివరీ సేవ ‘ఫ్లిప్కార్ట్ మినిట్స్’ దేశవ్యాప్తంగా వెయ్యి మైక్రో ఫుల్ఫిల్మెంట్ కేంద్రాల మైలురాయిని చేరుకుంది. 2024 ఆగస్టులో ప్రారంభమైన ఈ సేవ ప్రస్తుతం 130కుపైగా నగరాలు, 8,000కుపైగా పిన్కోడ్లలో అందుబాటులో ఉంది. నెట్వర్క్ విస్తరణతో గత ఏడాదితో పోలిస్తే ఆర్డర్ల సంఖ్య ఐదు రెట్లు పెరిగినట్లు సంస్థ వెల్లడించింది.
ప్రత్యేకంగా రెండో, మూడో శ్రేణి నగరాల్లో ఈ సేవకు విశేష ఆదరణ లభిస్తోంది. అంబాలా, ఆరా, బొకారో, దర్భంగా, జోర్హాట్, ఒంగోలు, పూర్ణియా, సహర్సా, తెనాలి వంటి నగరాల్లో డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఈ ప్రాంతాల్లో వ్యాపారం గత ఏడాదితో పోలిస్తే 42 రెట్లు పెరిగినట్లు సంస్థ తెలిపింది. గత ఏడాదిలోనే 90కుపైగా కొత్త నగరాలను నెట్వర్క్లో చేర్చుకుంది.
ప్రస్తుతం మొత్తం వినియోగదారుల్లో 40 శాతానికి పైగా యువ వినియోగదారులే ఉన్నారు. నిత్యావసర వస్తువులతో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, సౌందర్య ఉత్పత్తులు, ఆరోగ్య, జీవనశైలి ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పండ్లు, కూరగాయల విభాగంలో సగటు ఆర్డర్ విలువ 30 శాతం పెరగగా, పునరావృత కొనుగోళ్లు 20 శాతానికి పైగా వృద్ధి చెందాయి. 250కుపైగా ఉత్పత్తి విభాగాల్లో సేవలు అందిస్తున్న సంస్థ, 500కుపైగా బ్రాండ్లతో పాటు 3,000కుపైగా రైతులతో భాగస్వామ్యం కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!