

తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎస్ఐఆర్ కమిటీతో సమావేశమై క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న కార్యక్రమాలు, ఓటర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో సుమారు 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయని, వాటిలో దాదాపు 73 నుంచి 74 లక్షల ఓట్లు ‘అన్కలెక్టబుల్’గా ఉన్నట్లు సమాచారం ఉందని తెలిపారు. అదేవిధంగా సుమారు 60 లక్షల ఓట్లలో అనామలీస్ ఉన్నట్లు తెలుస్తోందని, ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లపై సందేహాలు వ్యక్తమవుతుండటం ఆందోళనకరమన్నారు.
ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించిన అనంతరం జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే పార్టీ లీగల్ సెల్తో పాటు న్యాయ నిపుణులతో చర్చించి, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయిన సందర్భంలో తీసుకోవాల్సిన న్యాయపరమైన చర్యలపై సమాలోచనలు జరిపినట్లు చెప్పారు. ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు నిర్వహించే అంశాన్ని పరిశీలిస్తున్నామని, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్తో చర్చించిన అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా పార్టీ పరంగా, న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని, క్షేత్రస్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బాధిత ఓటర్లకు అవసరమైన సహాయం అందిస్తామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!