

దేశంలో మరోసారి ఎన్నికల సందడి మొదలైంది. అస్సాంలోని ఒక లోక్సభ స్థానం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, పుదుచ్చేరిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం (సెప్టెంబర్ 7) ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఆరు స్థానాలకు అక్టోబర్ 6న పోలింగ్ నిర్వహించనుండగా, అక్టోబర్ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు. వివిధ కారణాలతో స్థానాలు ఖాళీ కావడంతో ఈ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానం, పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్, రేజీగ్రామ్, పుదుచ్చేరిలోని తట్టంచావడి, తమిళనాడులోని మదురాంతకం, ధరాపురం అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
అయితే తమిళనాడులోని మరికొన్ని నియోజకవర్గాలకు ఈ దఫా ఉప ఎన్నికలు ప్రకటించలేదు. సీఎం విజయ్ రాజీనామా చేసినట్లు పేర్కొన్న తిరుచ్చి ఈస్ట్తో పాటు విరాలిమలై, పెరందురై, అంబాసముద్రం, కరూర్ తదితర స్థానాల్లో గత ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో, కేసులు పరిష్కారమై తీర్పులు వెలువడే వరకు ఆయా స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించబోమని గతంలో ఈసీ కోర్టుకు తెలిపింది. దీంతో తాజాగా ప్రకటించిన షెడ్యూల్లో ఆ స్థానాలకు చోటు దక్కలేదు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!