

వానాకాలంలో ప్రజలకు రేషన్ బియ్యం పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ పౌర సరఫరాల శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2026 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల కోటా కింద కేటాయించిన 6.17 లక్షల మెట్రిక్ టన్నుల పోషకాలతో కూడిన సన్న బియ్యాన్ని సెప్టెంబర్ 5లోపు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసింది. మూడు నెలలకు ప్రభుత్వం కేటాయించిన 6.48 లక్షల మెట్రిక్ టన్నుల్లో 6,16,806 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించారు. సుమారు 99.30 లక్షల మంది రేషన్ కార్డుదారులకు బియ్యం అందగా, దాదాపు 2.95 కోట్ల లావాదేవీలు నమోదయ్యాయి. ఆగస్టు 31 నాటికి 94.2 శాతం పంపిణీ పూర్తికాగా, కేంద్ర ప్రభుత్వం గడువు పొడిగించడంతో ఇది 95.13 శాతానికి చేరింది.
పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా, నిరంతరాయంగా జరిగేలా పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో రేషన్ షాపుల్లో బయోమెట్రిక్ విధానం, ఆన్లైన్ పర్యవేక్షణను మరింత పటిష్ఠం చేశారు. ఈ-పాస్ (ePoS) మిషన్ల ద్వారా బియ్యం పంపిణీ చేయడంతో పల్లెలు, వార్డుల స్థాయిలో అక్రమాలకు అవకాశం లేకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు ఇతర సంక్షేమ పథకాలకు కూడా ఆగస్టులో బియ్యం సరఫరా చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద 35,371 పాఠశాలల్లోని 27.36 లక్షల మంది విద్యార్థులకు 4,529 మెట్రిక్ టన్నుల బియ్యం, 4,389 సంక్షేమ హాస్టళ్లలోని 11.72 లక్షల మంది విద్యార్థులకు 13,555 మెట్రిక్ టన్నుల బియ్యం అందించారు. 35,700 అంగన్వాడీ కేంద్రాలకు కూడా బియ్యం పంపిణీ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!