

తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అయిన సికింద్రాబాద్ ఉజ్జయిని శ్రీ మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల జాతరను అత్యంత ఘనంగా నిర్వహించాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. ఆలయాన్ని దర్శించేందుకు లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పాటు బోనాలు సమర్పించే శివసత్తులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని తెలిపారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని శ్రీ మహంకాళి దేవస్థానంలో నిర్వహించిన బోనాల సన్నాహక సమావేశంలో మంత్రి అధికారులతో ఏర్పాట్లను సమీక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఏడాది బోనాల నిర్వహణకు రూ.20 కోట్ల నిధులు కేటాయించడం హర్షణీయమని పేర్కొంటూ, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని విఐపీ, వివిఐపీ దర్శనాల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టాలని సూచించారు. భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు తదితర ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని ఆదేశించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!