

ముంబయిలో ప్రసిద్ధి చెందిన లాల్బాగ్చా రాజా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈసారి పర్యావరణహిత కార్యక్రమాలతో ప్రత్యేకంగా నిలవనున్నాయి. బృహాన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఉత్సవాల సమయంలో లాల్బాగ్చా రాజా మండపం వద్ద పేరుకుపోయే ఆహార, ప్రసాద వ్యర్థాలను పునరుత్పాదక విద్యుత్గా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. రోజుకు సుమారు 8–10 టన్నుల సేంద్రీయ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని అంచనా వేస్తున్నారు. సామూహిక వంటశాల నుంచి సేకరించే వ్యర్థాలను నాయర్, కస్తూర్బా, జీటిబీ, సియాన్ ఆస్పత్రుల్లోని జీవమీథనీకరణ ప్లాంట్లకు తరలించనున్నారు. వీటి ద్వారా సుమారు 7,744 యూనిట్ల పునరుత్పాదక విద్యుత్ను ఉత్పత్తి చేసి, నాలుగు ఆస్పత్రుల్లోని ఇన్పేషెంట్ వార్డులు, కారిడార్లలో లైటింగ్కు వినియోగించనున్నారు.
అలాగే, తొలిసారిగా కృత్రిమ నిమజ్జన చెరువులు, తాత్కాలిక ట్యాంకులు, ఇతర జలాశయాల్లో నిమజ్జనం చేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయక విగ్రహాలను బీఎంసీ రీసైకిల్ చేయనుంది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు నిమజ్జనం జరిగిన 24 గంటల్లోపు విగ్రహాలను వెలికితీసి రీసైకిల్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా లభించే పదార్థాలను తిరిగి విగ్రహాల తయారీ, ప్లాస్టర్ బోర్డులు, సిరామిక్స్, ఇటుకలు, సిమెంట్ పరిశ్రమలో ఫిల్లర్ పదార్థంగా ఉపయోగించే అవకాశం ఉంది. 1934 నుంచి లాల్బాగ్ మార్కెట్లో కొలువుదీరుతున్న లాల్బాగ్చా రాజా ఉత్సవాలకు ప్రతి ఏడాది భారీ సంఖ్యలో భక్తులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతుంటారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!