

నిఖిల్ సిద్ధార్థ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’పై తాజాగా కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రకటన వచ్చి చాలా కాలమైనప్పటికీ, సరైన అప్డేట్స్ లేకపోవడం, విడుదల తేదీని ప్రకటించకపోవడంతో పలు ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో నిఖిల్ తన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ బహుభాషా పాన్ ఇండియా చిత్రం విడుదల తేదీ ప్రకటనకు సమయం ఆసన్నమైందని తెలిపారు. ఒకే సినిమా కోసం 175 రోజుల పాటు చిత్రీకరణ జరపడం, 2,500 గ్రాఫిక్స్ షాట్స్ రూపొందించడం తాను ఎప్పుడూ ఊహించలేదని పేర్కొన్నారు.
భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో భారీ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ‘స్వయంభు’ తెరకెక్కుతోంది. సినిమా విడుదల తేదీ ప్రకటన త్వరలోనే రానుందని నిఖిల్ వెల్లడించడంతో అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. సంయుక్త మీనన్, నభా నటేష్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్, ఎక్లిప్స్ క్రియేషన్స్ బ్యానర్లపై భువన్ సాగర్, శ్రీకర్, ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!