

కేరళ రాజధాని తిరువనంతపురంలోని చారిత్రక జీవీ రాజా స్టేడియం త్వరలో సరికొత్త రూపు సంతరించుకోనుంది. స్టేడియం ఆధునీకరణ కోసం కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపీ రూ.100 కోట్ల కేటాయింపును ప్రకటించారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా స్టేడియాన్ని అభివృద్ధి చేసి, ఆధునిక అథ్లెటిక్స్, క్రీడా వసతులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. 2036 ఒలింపిక్స్, పారాలింపిక్స్ నిర్వహణకు భారత్ ఆసక్తి వ్యక్తం చేస్తూ 2024లో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ సమర్పించింది. ప్రస్తుతం భారత్ బిడ్ ఐఓసీ నిరంతర చర్చల దశలో ఉంది.
స్టేడియం యజమాన్య బాధ్యతలు చూస్తున్న కేరళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ మోహనన్ కున్నుమ్మల్, సిండికేట్ ఫైనాన్స్ కమిటీ సభ్యుడు ఆర్.ఎస్. శశికుమార్లతో కలిసి సురేశ్ గోపీ స్టేడియాన్ని పరిశీలించారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR), మాస్టర్ ప్లాన్ను కేరళ యూనివర్సిటీ సిద్ధం చేయనుంది. 1937లో అప్పటి తిరువాన్కూర్ ప్రాంతంలో నిర్మితమైన ఈ స్టేడియానికి క్రీడారంగంలో ప్రత్యేక చరిత్ర ఉంది. కేరళ క్రీడారంగంలో ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందిన కల్నల్ జీవీ రాజా పేరును దీనికి పెట్టారు. ప్రస్తుతం మౌలిక వసతుల పునరుద్ధరణ అవసరమైన ఈ స్టేడియాన్ని ఆధునీకరించడం ద్వారా అథ్లెట్లకు మెరుగైన శిక్షణ, పోటీలకు అనువైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!