

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో ఆదివారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సోమవారం కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. గత 24 గంటల్లో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెనలో 9.35 సెం.మీ, ఖమ్మం జిల్లా కారేపల్లిలో 6.5 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్లో 6.45 సెం.మీ వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా ఆసిఫాబాద్ జిల్లాలోని వట్టివాగు, కుమరం భీం ప్రాజెక్టుల్లోకి 2,172 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, అధికారులు దిగువకు 1,378 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!