

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సర్వం సిద్ధం చేస్తోంది. సెప్టెంబరు 15 నుంచి 23 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 12 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన పాలకమండలి సమావేశంలో భక్తుల సౌకర్యాలు, ఉద్యోగుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భక్తులు, ఉద్యోగులకు ఇచ్చే ప్రమాద బీమా మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని నిర్ణయించారు. ఎల్ఐసీ భాగస్వామ్యంతో రెండు రకాల ఇన్సూరెన్స్ విధానాలను అమలు చేయనున్నారు. అలాగే 48 కేటగిరీల టీటీడీ ఉద్యోగుల వేతనాల పెంపునకు ఆమోదం లభించింది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా లడ్డూల కొరత లేకుండా 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా సిద్ధం చేయనున్నారు. అదనంగా 400 మంది పోటు సిబ్బందిని నియమించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరారు. తిరుమల హోటళ్ల నుంచి సేకరించే తడి వ్యర్థాలతో బయోగ్యాస్ తయారు చేసి, నిత్యాన్నప్రసాద భవనంలో వంటలకు వినియోగించేందుకు చర్యలు చేపట్టారు. ఉత్సవాల్లో 25 రాష్ట్రాల నుంచి 27 సాంస్కృతిక బృందాలతో పాటు సింగపూర్, జపాన్ కళాకారులు పాల్గొననున్నారు. భక్తుల భద్రత కోసం 3,000 మంది పోలీసులతో కలిపి మొత్తం 5,600 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబరు 15న సీఎం శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనుండగా, గరుడ సేవ రోజున అదనపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!