

టాలీవుడ్ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ ఇటీవల చేసిన ‘జై శ్రీరామ్’ వ్యాఖ్యలపై కొనసాగుతున్న వివాదం తాజాగా మరో మలుపు తిరిగింది. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకర వ్యాఖ్యలకు స్పందించే క్రమంలో అనసూయ ‘జై శ్రీరామ్’ అనే పదాన్ని ప్రస్తావించడంతో వివాదం చెలరేగింది. దీనిపై విమర్శలు రావడంతో.. తన మాటలను సందర్భం నుంచి వేరు చేసి వక్రీకరించారని, ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తనకు లేదని ఆమె సోషల్ మీడియా ద్వారా వివరణ ఇచ్చినట్లు సమాచారం. అనసూయ టెలివిజన్ యాంకర్గా, నటిగా తెలుగు పరిశ్రమలో గుర్తింపు పొందారు.
తాజాగా ఈ వివాదంపై నటి హేమ వీడియో సందేశం ద్వారా స్పందించారు. సోషల్ మీడియాలో ప్రముఖులు మాట్లాడే ప్రతి మాటను నిశితంగా పరిశీలిస్తారని తెలిసినప్పటికీ.. ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చిందని అనసూయను ప్రశ్నించారు. వ్యక్తిగత నమ్మకాలు, ధర్మం వ్యక్తిగత విషయాలేనని చెబుతూ.. కోట్లాది మంది విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అలాగే అనసూయ తన రెండో వీడియోలో ఇచ్చిన వివరణపైనా హేమ ప్రశ్నలు లేవనెత్తారు. తాను కొందరిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడానని చెబుతున్నప్పుడు.. ఆ వ్యక్తులు ఎవరో స్పష్టంగా చెప్పాలని పేర్కొన్నారు. హేమ వ్యాఖ్యలతో ఈ వివాదం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!