

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రాజకీయాల్లో పురుషాధిక్యతను అధిగమించి మహిళలు ముందుకు రావాలని చెబుతుంటే.. తెలంగాణలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శాసనసభ్యులపై దాడులు చేయిస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. ఆడబిడ్డల గొంతులు పట్టి, జుట్టు లాగడమే ప్రజాపాలనా? ఇందిరమ్మ రాజ్యమంటే ఇదేనా? అని ప్రశ్నించారు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యత వహించి క్షమాపణ చెప్పే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. మహిళా ఎమ్మెల్యేలపై దాడి అంశం నుంచి దృష్టి మళ్లించేందుకే ఎమ్మెల్సీ తాతా మధు అనని మాటలను ఆయనకు ఆపాదిస్తూ ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు, రాహుల్గాంధీ ఇలాంటి టీషర్టులు ధరించి నినాదాలు చేసిన సందర్భాల్లో వారిని ఎవరూ అడ్డుకోలేదని, లోక్సభ నిబంధనలే శాసనసభలోనూ వర్తిస్తాయని పేర్కొన్నారు. దళితులపై ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుత సమావేశాల్లోనే దళిత డిక్లరేషన్పై చర్చించాలని డిమాండ్ చేశారు.
భారాస శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, ఫింఛన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడకుండా తమ గొంతు నొక్కారని ఆరోపించారు. పోలీసులను ప్రయోగించి భారాస ఎమ్మెల్యేలను మెడ పట్టి బయటకు గెంటేశారని, మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా వ్యవహరించారని విమర్శించారు. మరోవైపు అసెంబ్లీ వద్ద జరిగిన తోపులాటలో గాయపడిన ఎమ్మెల్యేలు జగదీశ్రెడ్డి, మర్రి రాజశేఖర్రెడ్డిని నిమ్స్కు తరలించారు. పోలీసులపై దాడి, దుర్భాషలాడారన్న ఆరోపణలపై కేటీఆర్, హరీశ్రావు, సుధీర్రెడ్డితోపాటు పలువురిపై సైఫాబాద్ పోలీస్స్టేషన్లో కేసులు నమోదైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా, స్పీకర్ను కించపరిచే ఉద్దేశంతో తాను మాట్లాడలేదని ఎమ్మెల్సీ తాతా మధు స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను స్పీకర్ను ఉద్దేశించినవిగా భావిస్తే వాటిని వెనక్కి తీసుకుంటున్నానని, విచారం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. స్పీకర్, మండలి ఛైర్మన్పై తనకు పూర్తి గౌరవం ఉందన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!